న్యూఢిల్లీ: అమెరికా పర్యటన కోసం ఇవాళ ఉదయం ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం పాకిస్థాన్ వాయు మార్గం ద్వారా వెళ్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రూట్లో మోదీ ప్రయాణించే విమానం వెళ్లడం లేదని అధికారులు చెప్పారు. ప్రధాని విమానం తమ మార్గం ద్వారా వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ రూట్లో కమర్షియల్ ఫ్లయిట్లపై నిషేధం ఉన్న నేపథ్యంలో.. పాకిస్థాన్ వాయుమార్గం ద్వారా ప్రధాని మోదీ విమానం అమెరికా ట్రిప్కు వెళ్లింది. ఆ విమానంలో ప్రధాని మోదీతో పాటు ఎన్ఎస్ఏ సలహాదారుడు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగాల్, ఇతర ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
పాకిస్థాన్ ఆకాశమార్గాన్ని వాడుకునేందుకు భారతీయ అధికారులు ముందుగా ఆ దేశ పర్మిషన్ తీసుకున్నారు. ఇస్లామాబాద్లోని అధికారులు మోదీ విమాన ప్రయాణానికి పచ్చజెండా ఊపారు. అయితే 2019 సంవత్సరంలో మోదీ విమానానికి పాకిస్థాన్ అనుమతి ఇవ్వలేదు. జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆ ఆంక్షలు విధించారు. మోదీ, రాష్ట్రపతి కోవింద్ల విమానాలను పాక్ ఎయిర్స్పేస్ మీదుగా వెళ్లనివ్వలేదు. కానీ ఈ ఏడాది శ్రీలంక వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ విమానానికి భారత్ తమ వాయుమార్గాన్ని వాడుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ప్రధాని మోదీ ఇవాళ బోయింగ్-777 విమానంలో అమెరికా వెళ్లారు. ఢిల్లీలోని వైమానికదళ ఎయిర్బేస్ నుంచి ఆ విమానం ఎగిరింది. వీవీఐపీలను అమెరికాకు తరలించేందుకు బోయింగ్-777 విమానాలను వాడుతుంటారు. ఆ విమానాన్ని ఇటీవలే మాడిఫై చేశారు. దాంట్లో అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇండియా నుంచి అమెరికాకు బీ-777 నాన్ స్టాప్ విమాన ప్రయాణానికి 15 గంటల సమయం పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ వాయుమార్గాన్ని వాడకపోవడం వల్ల.. అదనంగా మరికొన్ని గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయి.