గాజులరామారం, మే 16 : పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట క్వారీ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎన్టీఆర్నగర్, ఎల్లమ్మబండకు చెందిన సురేశ్ , జయలక్ష్మి దంపతుల రెండవ కూతురు స్రవంతి.. అదే ప్రాంతానికి చెందిన విశాల్ అనే యువకుడిని ప్రేమించింది. ఇటీవల వీరిద్దరు ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. దీనికి వారు తిరస్కరించడంతో మనస్తాపానికి గురయ్యారు.
ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని, విశాల్ మీద అనుమానం ఉందని శనివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఆదివారం ఉదయం గాజులరామారం డివిజన్లోని బాలయ్యనగర్ క్వారీ గుంతలో రెండు మృతదేహాలు తేలాయి.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్వారీలో నుంచి మృతదేహాలను బయటకు తీసి పరిశీలించగా.. విశాల్, స్రవంతివని గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.