మంథని టౌన్, ఏప్రిల్ 20: ఎక్లాస్పూర్ కిడ్నాప్ కేసు చిక్కుముడి వీడింది. రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్న ఇద్దరిని అపహరించి రూ.50లక్షలు ఎత్తుకెళ్లినట్లు రామగిరి ఠాణాలో కేసు నమోదు కాగా, కిడ్నాప్ అంతా వట్టిదే అని, భూ సమస్య పరిష్కారానికి బాధితులే నాటకం ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈమేరకు మంథ ని పోలీస్స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం పెద్దపల్లి డీసీపీ పులిగిళ్ల రవీందర్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న లద్నాపూర్కు చెందిన పుష్పలత రామగిరి ఠాణాకు వచ్చి తన భర్త చిప్ప రాజేశం, అదే గ్రామానికి చెందిన ఉడుత మల్లయ్య కనిపించడం లేదని.. కాటారం మండలం గంగారానికి చెందిన బిల్క్ ఉన్నిసాబేగం వద్ద కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.50 లక్షల నగదుతో కలిసి వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వెంటనే మంథని సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐలు మహేందర్, ఓంకార్యాదవ్ రంగంలోకి దిగారని, కాటారం వెళ్లి బేగంను విచారించగా అక్కడి రాలేదని చెప్పినట్లు పేర్కొన్నారు.
అయితే 19న అర్ధరాత్రి 2:30గంటల సమయంలో రాజాపూర్ శివారులో మల్లయ్య, రాజేశాన్ని కిడ్నాపర్లు వదిలేశారని సమాచారం రాగా, పోలీసులు వెళ్లి వారిద్దరినీ విచారించారని, వారు చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ఈ క్రమంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా, బాధితులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిందన్నారు. వారిద్దరినీ గట్టిగా విచారించడంతో కిడ్నాప్ జరుగలేదని, తామే నాటకం ఆడినట్లు చెప్పారని తెలిపారు. బిల్క్ ఉన్నిసా బేగం భూమి విక్రయిస్తా అని చెప్పి, ఇద్దరి వద్ద రూ.36లక్షలను అడ్వాన్స్గా తీసుకొని నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ చేయకపోవడం, తీసుకున్న డబ్బులూ తిరిగి ఇవ్వవడం లేదని చెప్పారని వివరించారు. కిడ్నాప్ నాటకం ఆడితేనైనా ఆమె భయపడి తమ సమస్య పరిష్కారం అవుతుందనే ప్లాన్తోనే ఈ డ్రామా ఆడినట్లు నిందితులు తమ విచారణలో ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. కిడ్నాప్ నాటకమాడి పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసిన మల్లయ్య, రాజయ్యపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు సదయ్య, రవికి రివార్డులను అందజేయడంతోపాటు సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐల ను ప్రత్యేకంగా అభినందించారు.