న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వెళ్లనున్నది. దీని ద్వారా ఎల్ఐసీ రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తద్వారా ఒక్కో ఈక్విటీ షేర్ విలువ రూ.10 చొప్పున మొత్తం 2,500 కోట్ల షేర్లతో ఎల్ఐసీ ఐపీఓకు వెళ్లనున్నది.
ఈ షేర్లన్నీ ఎల్ఐసీ ఒకేసారి ఐపీవోలో పెట్టాల్సిన అవసరం లేదు. సంస్థ అవసరాలను బట్టి దశల వారీగా ఎల్ఐసీకి ఈ 2,500 కోట్ల షేర్లను విక్రయించే వెసులుబాటు ఉంటుంది. దశల వారీగా ఐపీవోలో షేర్లను విక్రయించడానికి తప్పనిసరిగా ఎల్ఐసీ బోర్డు అనుమతి తీసుకోనవసరం లేదు.
ప్రస్తుతం, 29 కోట్లకు పైగా చందాదారులు ఉన్న ఎల్ఐసీ పెయిడప్ క్యాపిటల్ రూ.100 కోట్లు. ఎల్ఐసీ ప్రయాణం 1956లో రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైంది. ప్రస్తుతం ఎల్ఐసీకి రూ.31,96,214.81 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎల్ఐసీ చట్టం 1956లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఎల్ఐసీ పెట్టుబడి రూ.25 వేల కోట్లుగా ఉండనుంది. ఒక్కో ఈక్విటీ షేర్ విలువ రూ.10 చొప్పున.. 2,500 కోట్ల షేర్లను విభజించే అవకాశం ఉంటుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గత నెల ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఎల్ఐసీ చట్ట సవరణ ప్రకారం.. ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ఓ బోర్డు ఏర్పాటు కానున్నది. మొత్తం 27 సవరణల్ని ప్రతిపాదించారు. లిస్టింగ్ తర్వాత తొలి ఐదేండ్లు సంస్థలో 75 శాతం వాటాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆ తర్వాత సర్కార్కు 51 శాతం వాటాలు ఉంటాయి. తద్వారా ఎల్ఐసీపై ప్రభుత్వానికి నియంత్రణాధికారం ఉంటుంది. ఇక దీంట్లో చందాదారులకు 10 శాతం వాటాల్ని రిజర్ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ గత ఇటీవల వెల్లడించారు.
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మొదలు కానున్నఆర్థిక సంవత్సరం(2020-21) లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం సముపార్జించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాది ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వెళుతుందని కేంద్రం తెలిపింది. ఎల్ఐసీ ఐపీవో ద్వారా దాదాపు రూ.90 వేల కోట్ల ఆదాయం సంపాదించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్ఐసీ ఐపీవోకు ఆటంకంగా ఉన్న కొన్ని చట్టపరమైన నిబంధనలకు సవరణలు చేపట్టే ప్రక్రియ సెబీ చేపట్టినట్లు వినికిడి.