న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ టీకాల భద్రత, దుష్ప్రభావాలపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. రక్తం గడ్డకట్టం లాంటి తీవ్ర, తేలిక పాటి కేసులు ఏవైనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దేశంలో 83 మిలియన్లకుపైగా ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. మిగతా 8.1 మిలియన్ మోతాదులు భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకా. యూరప్, యూకేలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టిన కేసులు నమోదవగా.. పలువురు మృతి చెందారు.
యూరోపియన్ యూనియన్, యూకే మెడికల్ రెగ్యురేటరీలు అరుదైన రక్తం గడ్డకట్టే, వ్యాక్సిన్ మధ్య సంబంధంపై ప్రకటన చేశాయి. ఈ క్రమంలో భారత నిపుణులు అప్రమత్తమయ్యారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ తీసుకున్న వ్యక్తుల్లో ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? అని పరిశీలిస్తున్నామని, వచ్చే వారం నాటికి నివేదిక సిద్ధం కావొచ్చన్నారు. టీకాతో రక్తం గడ్డకట్టడాన్ని ‘చాలా అరుదైన’ దుష్ప్రభావంగా పరిగణించాలని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) బుధవారం చెప్పింది. యూకేలోని ఓ సంయుక్త కమిటీ 30 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు ప్రత్యామ్నాయంగా మరో వ్యాక్సిన్ వేయాలని సూచించింది.
ఈఎంఏ భద్రతా కమిటీ మెదడులో రక్తం గడ్డకట్టడం (సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రోంబోసిస్) 62 కేసులు, 22 పొత్తి కొడుపులో రక్తం గడ్డకట్టడం (స్ల్పాంక్నిక్ వీసస్ థ్రోంబోసిస్) కేసులపై లోతైన సమీక్ష నిర్వహించింది. ఈ కేసులు యూరప్, యూకేలో రికార్డయ్యాయి. టీకాలు వేసిన రెండు వారాల్లోపు 60 ఏళ్లలోపు మహిళల్లో ఎక్కువ కేసులను గుర్తించారు. ఏప్రిల్ 4వ తేదీ నాటికి ఐరోపా సమాఖ్య, యూకేలో 34 మిలియన్ల మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో 9 కోట్ల డోసులకుపైగా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు భారత్ కమిటీ 13 దుష్ప్రభావాలపై సమీక్షించింది.
ఈఎంఏ ప్యానెల్ ఈ నెల 4వ తేదీ నాటికి 200కుపైగా రక్తం గడ్డకట్టే కేసులను సమీక్షించింది. దేశంలో 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఐదుగురు వ్యక్తులు టీకాలు వేసిన తర్వాత గుండెపోటుతో మరణించారు. మరణాలు ‘టీకాతో సంబంధం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 13 తీవ్రమైన దుష్ప్రభావాలు, మరణాలకు మాత్రమే తుది నివేదికలు జారీ చేశారు. అనేక సందర్భాల్లో పోస్ట్మార్టం నిర్వహించడం లేదు. జిల్లా పరిపాలన, హాస్పిటళ్ల నుంచి క్షేత్రస్థాయిలో వచ్చిన డేటాలో పెద్ద అనంతరం ఉంటోంది.
దీనిపై అమెరికాలోని మసాచుసెట్స్కు చెందిన వ్యాక్సిన్ నిపుణుడు దేవిందర్ గిల్ మాట్లాడుతూ భారత్ ఏఈఎఫ్ఐ (టీకాలు వేసిన తర్వాత ప్రతికూల ఘటనలు) ప్యానెల్ నివేదిక కోసం ఎదురు చూడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. డేటా కోసం చూడకుండా గ్లోబల్ డేటాను సమీక్షించడం సాధ్యమయ్యే చర్య అనీ, వ్యాక్సిన్.. రక్తం గడ్డకట్టడానికి మధ్య ఉన్న లింక్ను చూస్తే.. సమస్యపై స్పష్టత వచ్చే వరకు 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వాడకాన్ని పరిమితం చేయవచ్చన్నారు.