సిటీబ్యూరో, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ): నగర శివారులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు భవనాల వద్దకు అర్ధరాత్రి వెళ్లి తుపాకీ చూపించి లక్షలు ఖరీదు చేసే విద్యుత్ పరికరాలను చోరీ చేసిన ముఠాను కొద్ది నెలల కిందట సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. యూపీ, రాజస్థాన్కు చెందిన 9మంది ముఠా సభ్యులు దుండిగల్, ఆర్సీపురం, శంకర్పల్లి, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తేలడంతో జైలుకు పంపారు. అయితే వీరు తిరిగి బయటికి వస్తే దోపిడీ దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఉండటంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బుధవారం వీరిపై పీడీ యాక్ట్ విధించారు. చర్లపల్లి జైలులో ఉన్న ముఠా సభ్యులు మరో ఏడాది జైలులోనే ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. పీడీ యాక్ట్ పడిన వారిలో ధర్మేందర్ కుమార్, సత్యభాన్ సింగ్, ధర్మేందర్ సింగ్, సంజయ్, నిహాల్ సింగ్, శైలేంద్ర సింగ్, మాధవ్ సింగ్, కులదీప్, ప్రదీప్ ఉన్నారు.