న్యూఢిల్లీ: ఎన్సీపీ నేత, ఎంపీ శరద్ పవార్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నివాసంలో సుమారు 50 నిమిషాల పాటు వారిద్దరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది. శరద్ పవార్, మోదీ మాట్లాడుకుంటున్న ఫోటోను ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్లో పోస్టు చేసింది. వర్షాకాల సమావేశాలు 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. మరో వైపు రాష్ట్రపతి పదవి కోసం శరద్ పవార్ పోటీలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను ఆయన ఖండించారు. గాంధీ కుటుంబంతో వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయిన నేపథ్యంలో శరద్ ఎపిసోడ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ తాను రాష్ట్రపతి ఎన్నికల్లో నిలవడంలేదని పవార్ అన్నారు. శరద్ పవార్ వయసు 80 ఏళ్లు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష పార్టీల వైపున నిలబడ్డారు. కానీ 2024లో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ మారుతుంటాయని ఆయన ఇటీవల తెలిపారు.