పాట్నా: బీహార్లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోకి 5.5 లక్షలు క్రెడిట్ అయ్యాయి. అయితే బ్యాంక్ తప్పిదం వల్ల ఆ అమౌంట్ అతని ఖాతాలో పడింది. కానీ ఆ డబ్బును వాపస్ ఇచ్చేందుకు అతను నిరాకరించాడు. ఇది ప్రధాని మోదీ పంపిన డబ్బు అని, దీన్ని తిరిగి ఇచ్చేది లేదన్నారు. బక్తియాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్కు గ్రామీణ బ్యాంక్లో ఖాతా ఉన్నది. అయితే అకౌంట్లో పడిన డబ్బులను అతను వాడేశాడు. బ్యాంక్ ఎన్ని నోటీసులు పంపినా.. అతను స్పందించలేదు. డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆ డబ్బును ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు. ఈ ఏడాది మార్చిలో తనకు ఆ అమౌంట్ వచ్చిందని, ఆ సమయంలో తాను ఎంతో సంతోషించానని, ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తానని హామీ ఇచ్చారని, బహుశా దానికి చెందిన తొలి ఇన్స్టాల్మెంట్ అయి ఉంటుందని రంజిత్ దాస్ తెలిపారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేశామని, ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నామని మాన్సీ పోలీసు స్టేషన్ ఆఫీసర్ తెలిపారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి.. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తామని గతంలో ప్రధాని మోదీ తెలిపిన విషయం తెలిసిందే.