న్యూఢిల్లీ : కొవిడ్-19 పోరులో ఎకానమీకి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించిన రూ ఆరు లక్షల కోట్లకు పైబడిన ఉద్దీపన ప్యాకేజ్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన ఊరట చర్యలు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసి ఉత్పత్తి, ఎగుమతులను పెంచుతాయని, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు.
ఆరోగ్య రంగం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, రైతులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి దోహదపడేలా ప్యాకేజ్లో పలు చర్యలు చేపట్టారని అన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యలతో ప్రజారోగ్య వసతులు మెరుగుపడతాయని, వైద్య మౌలిక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి ఉపకరించేలా ఉద్దీపన ప్యాకేజ్లో శ్రద్థ కనబరిచారని ప్రధాని పేర్కొన్నారు.