న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఉచిత రేషన్ లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) లబ్ధిదారులతో ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇబ్బందులు పడిన ప్రజలకు అన్ని విదాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. పీఎంజీకేఏవై పధకం పెద్దసంఖ్యలో ప్రజలకు ఉపయోగపడాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని చెప్పారు.
గోడౌన్లలో ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతున్నా మరోవైపు ఆకలి, పోషకాహారలోపం ఆ స్ధాయిలో తగ్గడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన పంపిణీ విదానం లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. అనర్హులైన లబ్ధిదారులను వ్యవస్ధ నుంచి తొలగించి రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేశామని తెలిపారు. పీఎంజీకేఏవై పధకం ఈ ఏడాది దీపావళి వరకూ అమల్లో ఉంటుందని, ఈ పధకం ద్వారా గుజరాత్లో 3.5 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.