కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బెంగాలీ బిడ్డ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవుట్సైడర్ వ్యాఖ్యలను మోదీ తోసిపుచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్ర బోస్, బంకించంద్ర ఛటర్జీ వంటి దిగ్గజాలు పుట్టిన బెంగాల్లో భారతీయులెవరూ బయటివారు కాదని పేర్కొన్నారు. వందేమాతరం నినాదంతో దేశ ప్రజలను ఏకం చేసిన ఈ గడ్డపై మమతా దీదీ బయటివారు అంటూ తమను ఎద్దేవా చేస్తున్నారని ఇక్కడ ఏ ఒక్క భారతీయుడూ బయటివారు కాదని అందరం భరతమాత బిడ్డలమేనని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ పర్బ మెదినిపూర్ జిల్లాలోని కాంతిలో బుధవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. బెంగాల్ను ఢిల్లీ, గుజరాత్ల నుంచి వచ్చేవారు పాలించడాన్ని తాను అనుమతించనని మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి ఇటీవల పలుమార్లు వ్యాఖ్యానించారు. బెంగాల్ తన కుమార్తెనే కోరుకుంటోందనే నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రధానంగా తెరమీదకు తెస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎన్నికల టూరిస్టులుగా రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని తృణమూల్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ బెంగాలీ బిడ్డకే సీఎం పీఠం కట్టబెడతామని స్పష్టం చేశారు.