న్యూఢిల్లీ: సాధారణ సిటిజన్లకు సాధికారత కల్పించడానికి డిజిటల్ మీడియా గొప్ప మీడియం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పేదల జీవితాలను మాత్రమే కాక మధ్య తరగతి, యువత జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నదన్నారు. డిజిటల్ ఇండియా ప్రతి ఒక్కరికి అవకాశం, ప్రతి ఒక్కరి సౌలభ్యం-భాగస్వామ్యం కల్పిస్తున్నదని తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ పూర్తయి ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు.
డిజిటల్ ఇండియా పారదర్శకంగా, వివక్షా రహిత వ్యవస్థగా రూపుదిద్దుకున్నదని తెలిపారు. అవినీతిపై దాడి చేస్తుందన్నారు. డిజిటల్ ఇండియా సమయంతోపాటు కార్మికులు, మనీ ఆదా చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పొందేందుకు కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ట పాలన అందిస్తుంది డిజిటల్ ఇండియా అని మోదీ చెప్పారు.
కరోనా వల్ల గత 18 నెలలుగా ప్రజల ఖాతాల్లో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) కింద రూ.7 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రతి నెలా భీమ్ యూపీఐ కింద రూ.5 లక్షల కోట్ల నగదు లావాదేవీలు జరుగుతన్నాయని చెప్పారు. ఒకే దేశం, ఒకే మద్దతు ధర (ఎంఎస్పీ)కి డిజిటల్ ఇండియా స్ఫూర్తి అని అన్నారు.
10,12, కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థుల మార్క్ లిస్టులు, ఇతర పత్రాలు డిజిలాకర్లో భద్రపరుచుకోవచ్చునని చెప్పారు. డిజి లాకర్ ద్వారానే కరోనా వేళ పలు కాలేజీలు, యూనివర్సిటీలు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాయని గుర్తు చేశారు. యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, వన్ రేషన్- వన్ నేషన్కు దోహద పడుతుందన్నారు.