జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి
జనగామ, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వసిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి కోరారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో అధ్యక్షుల హోదాలో జడ్పీటీసీ సభ్యులు పాల్గొని జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఉద్దేశించిన అభివృద్ధి, సంక్షేమ ప్రగతి ప్రణాళికలపై చర్చించారు. రానున్న మూడు నెలల ప్రగతి ప్రణాళికలు, పనుల ప్రతిపాదనలపై తీర్మానాలను ఆమోదించారు. 1,2,4,7 స్థాయి సంఘాల సమావేశాల్లో ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం వంటి అంశాలపై ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లా పరిషత్ ద్వారా అందిన నిధులు, వాటి వినియోగం, గ్రామాల్లో చేపట్టిన పనులపై జడ్పీ చైర్మన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాగాల మాట్లాడుతూ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పల్లెల ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పత్యేక చర్యలు, కరోనా విపత్కర సమయంలోనూ ప్రతినెలా సకాలంలో గ్రామాలకు నిధుల విడుదల చేస్తుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉద్దేశించి విడుదల చేస్తున్న నిధులను క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నామని, వాటిని వినియోగిస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు చెత్తను డంపింగ్యార్డుకు తరలించాలని, హరితహారం లో నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కనీసం 75 శాతం మొక్కలను కాపాడాలని కోరారు. కొవిడ్ నేపథ్యంలో పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది అప్రమత్తమై అందుబాటులో ఉంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని సంపత్రెడ్డి సూచించారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు సబంధించి పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని సంపత్రెడ్డి ఆదేశించారు. జూలై 1 నుంచి 10 వరకు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. 3వ స్థాయీ సంఘం అధ్యక్షురాలి హోదాలో జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి వ్యవసాయ, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖల అభివృద్ధి పనులపై సమీక్షించారు. 5వ స్థాయీ సంఘం అధ్యక్షురాలి హోదాలో తరిగొప్పుల జడ్పీటీసీ ముద్దసాని పద్మజారెడ్డి అధ్యక్షతన స్త్రీ, శిశు సంక్షేమశాఖ అభివృద్ధి పనులపై, 6వ స్థాయీ సంఘం అధ్యక్షుడి హోదాలో స్టేషన్ఘన్పూర్ జడ్పీటీసీ మారపాక రవి సాంఘిక సంక్షేమశాఖల అభివృద్ధి పనులపై సమీక్షించారు. మైనార్టీ, పేద బాలికలు జిల్లాలో ప్రారంభమైన మైనార్టీ ఇంటర్ కాలేజీని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో విజయలక్ష్మి, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ శ్రీనివాస్రావు, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొల్లం మణికంఠ, జడ్పీటీసీలు పల్లా భార్గవి, నిమ్మతి దీపిక, మాలోత్ శ్రీనివాస్, ముద్దసాని పద్మ, ఇల్లందుల బేబి, గుడి వంశీధర్రెడ్డి, కేలోత్ సత్తమ్మ, కోఆప్షన్ సభ్యుల మదార్, ఎండీ గౌస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.