హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ గ్రామాలకు చెందిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు నిర్వాసిత కుంటుంబాలను గుర్తించినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. బాధితులు అంగీకరిస్తే పూర్తి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చింది. ముంపు బాధితుల్లోని ముగ్గురు ఒంటరి మహిళలు, పురుషులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుచేస్తామని, పరిహారం కూడా చెల్లిస్తామని తెలిపింది. రెండురోజుల్లో పరిహారం, వారంలోగా ప్యాకేజీ అమలుచేయాలని న్యాయమూర్తులు జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పీ నవీన్రావుతో కూడిన హైకోర్టు స్పెషల్ గ్రీన్బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. వేములఘాట్కు చెందిన వై కమలమ్మ సహా 52 మంది, ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన ఎన్ అన్నవ్వ సహా 27 మంది వేర్వేరుగా దాఖలుచేసిన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారించింది.
ఒంటరి మహిళలు, పురుషులను కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లింపులు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది గణాంకాలతో వివరించడాన్ని హైకోర్టు అడ్డుకుంది. కేసు మెరిట్స్పై వాదనలు ఇప్పుడు వినిపించవద్దని స్పష్టంచేసింది. మళ్లీ మొదటినుంచి వాదన లు చెబుతామంటే ఎలాగని ప్రశ్నించింది. పిటిషనర్లు ఏం కోరుకుంటున్నారో చెప్పాలని కోరింది. దీనిపై న్యాయవాది స్పంది స్తూ.. ప్రభుత్వ జీవో 141 ప్రకారం ఒంటరి మహిళలు, పురుషులను, లింగభేదం లేకుండా 18 ఏండ్లు నిండిన అవివాహిత యువతీ యువకులను ప్రాజెక్టు డిస్ప్లేస్మెంట్ ఫ్యామిలీ (పీడీఎఫ్)గా గుర్తించి సాయం అందజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది రాజీవ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీడీఎఫ్ ఫ్యామిలీలను నాలుగు క్యాటగిరీలుగా విభజించి పరిహారం చెల్లించినట్టు చెప్పారు.
కుటుంబంతో కలి సి ఉన్న ఒంటరి మహిళలను ప్రత్యేక పీడీఎఫ్గా గుర్తింపునకు సాధ్యంకాదన్నారు. ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణను మూడువారాలకు వాయిదావేయాలని కోరారు. ధర్మాసనం విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన తిరుమల మల్లేశం సహా 103 మంది రైతులు పరిహారం విషయమై దాఖలుచేసిన మరో పిటిషన్ను ఇదే బెంచ్ విచారించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.