వరంగల్ అర్బన్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదన్న కేంద్ర హోంశాఖ ప్రకటనను వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేశారు. రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీ సాధనకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ పార్టీలు కలసి రావాలన్నారు.
ఉత్తర తెలంగాణలో అభివృద్ధికి కేంద్ర బిందువు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు మాత్రమేనని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాట్లే ఐక్య పోరాటాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా సాధించుకుందాం. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రతి ఒక్క తెలంగాణ వాది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేంతవరకు కేంద్ర ప్రభుత్వంపై మా పోరాటం ఆగదన్నారు.