పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
అన్ని సౌకర్యాలతో వైకుంఠధామ నిర్మాణం
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
సత్తుపల్లి, మార్చి 27: మండల పరిధిలోని కిష్టారం పంచాయతీ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధితో కొత్త కళను సంతరించుకున్నది. పాలకవర్గం ‘పల్లె ప్రగతి’ పనుల్లో భాగంగా పల్లెను అభివృద్ధి బాట పట్టించింది. పారిశుధ్య నిర్వహణ కోసం ఇంటింటికీ చెత్తబుట్టలు పంపిణీ చేయడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది. నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని గ్రామం ఇతర పంచాయతీలకూ ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో జనాభా 9 వేలు. పాలకవర్గం రూ.10లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, రూ.4 లక్షలతో కల్వర్టులు నిర్మించింది. ఉపాధి పథకం ద్వారా రూ.4 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు ఏర్పాటు చేసింది. హరితహారంలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటించి వాటి సంరక్షణ చేపడుతున్నది. హరితవనాలు ఏర్పాటు చేసి వాటిలో 17 వేల మొక్కలను పెంచుతున్నది.
పక్కాగా పారిశుధ్య నిర్వహణ
పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పచ్చదనాన్ని పంచుతున్నది. వనమాలి మొక్కల సంరక్షిస్తున్నారు. నాలుగు ఎకరాల్లో హరితవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామ నర్సరీలో భాగంగా 20 వేల మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలను హరితహారం భాగంగా నాటనున్నారు. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంతో అఖరి మజిలీ కష్టాలు తీరాయి. ప్రస్తుతం అన్ని హంగులతో శ్మశాన వాటిక అందుబాటులోకి వచ్చింది. డంపింగ్యార్డు ఏర్పాటు కావడంతో పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి కంపోస్ట్ ఎరువుగా తయారుచేస్తున్నారు.