హమాలీల సంఖ్యను పెంచాలి
నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్
పలు కొనుగోలు కే్ంరద్రాల పరిశీలన
చెన్నారావుపేట, మే 16 : వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నర్సంపేట ఆర్డీవో పవన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్లు, లారీలను గంటల కొద్ది వెయిట్ చేయించకుండా త్వరగా దిగుమతి చేసుకునేలా హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతుల ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలన్నారు. కాగా, రైతు వేదికల్లో కూడా ధాన్యం దిగుమతికి అవకాశం ఇవ్వాలని ఆర్డీవోను రైస్ మిల్ యజమాని విజేందర్ కోరగా జల్లి, అమీనాబాద్ గ్రామాల్లోని వేదికల్లో దిగుమతికి అనుమతి ఇచ్చారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బస్తా తూకం 42 కేజీల కంటే ఎక్కువ వేయకూడదని ఆర్డీవో హెచ్చరించారు. కాగా, తహసీల్దార్ పూల్ సింగ్చౌహాన్ తిమ్మరాయినిపహాడ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఉన్న మహిళా సంఘాల సభ్యులు బార్దాన్ సరిగా ఇవ్వట్లేదని తెలుపగా అప్పటికప్పుడు 10 వేల గన్నీ బ్యాగులను తెప్పించారు. కార్యక్రమంలో గిర్దావర్ స్వామి, వీఆర్వో ఐలయ్య పాల్గొన్నారు.
ఖానాపురం మండలంలో..
ఖానాపురం : మండలంలోని బుధరావుపేట, ఐనపల్లి, ఖానాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ జూలూరి సుభాషిణి పరిశీలించారు. ఖానాపురం శివారులోని శ్రీనివాస రైస్ మిల్లులో ధాన్యం దిగుమతులను పరిశీలించారు. కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ట్రాక్టర్లు, లారీలకు అధిక ధరలు చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరనే చెల్లించాలన్నారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
సింగరాజుపల్లిలో..
దామెర : మండలంలోని సింగరాజుపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కాగితాల శంకర్ సందర్శించారు. ధాన్యం తడువకుండా ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రియాజొద్దీన్, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
రాయపర్తి మండలంలో..
రాయపర్తి : మండలంలోని గ్రామాల్లో ఇందిరాక్రాంతి పథకం-మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నేతృత్వంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువకుండా నిర్వాహకులు రైతులకు సహకరించాలని తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ కోరారు. తుఫాన్ నేపథ్యంలో మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేస్తున్న విధానం, మార్కెట్లో ధాన్యపు నిల్వలను పరిశీలించారు. ఆయన వెంట జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు ఉన్నారు.