వారణాసి, జూలై 15: వారణాసిలో అణువణువునా కళలు, సంగీతం మిళితమై ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కళల గురించి అధ్యయనం చేయాలనుకునేవారికి ఇదొక ప్రపంచ కేంద్రం అని కొనియాడారు. ఒకరోజు పర్యటన సందర్భంగా మోదీ గురువారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. కాశీలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ సహకార, సమావేశ కేంద్రం-రుద్రాక్షను ప్రారంభించారు. మేధో చర్చలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, సెమినార్లకు వారణాసి ప్రపంచ కేంద్రంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం సమర్థంగా పోరాడిందని ప్రశంసించారు. వారణాసిలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరోవైపు వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు.