వివిధ రకాల సాగుతో మెరుగైన ఆదాయం
మిరప, పసుపు పంటలకు పెట్టింది పేరు
వరి, మక్క సీడ్లో ప్రత్యేకం
అరటి, కూరగాయల సాగులోనూ ముందంజ
హుజూరాబాద్, ఏప్రిల్ 4: సేద్యమంటే ఒక నిరంతర యజ్ఞం. ఒక ఆలోచన, ప్రణాళిక ఉంటేనే చేసే ప్రతి పని ఫలప్రదమవుతుంది. సాగు బంగారమవుతుంది. లేదంటే నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. ఇట్లాంటి సరికొత్త పద్ధతులే పాటిస్తూ ఇల్లందకుంట మండల రైతులు ఎవుసంలో లాభాల పంట పండిస్తున్నారు.
ఎటు చూసిన సీడ్ మక్కే..
ఇల్లందకుంట మండలంలో మొత్తం 16,955 ఎకరాల సాగు భూమి ఉంది. 5,772 ఎకరాల్లో మక్క సాగు చేయగా, ఇందులో 4500 ఎకరాలు ఆడ, మగ మక్కే ఉంది. ఎటు చూసినా మండలంలో మక్కజొన్న పచ్చదనంతో కళకళలాడుతున్నది. అదే విధంగా 10,548 ఎకరాల్లో వరి సాగు కాగా, సగానికన్నా ఎక్కువ ఇందులో సీడ్ ఉంటుంది. పదెకరాల్లో అరటి, 35 ఎకరాల వరకు పసుపు, 20 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, వంద ఎకరాల్లో పల్లి, 20 ఎకరాల్లో నువ్వులు, 440 ఎకరాల్లో మిరపతోట సాగు చేశారు. వందెకరాల్లో పలు రకాల కూరగాయలు, 50 ఎకరాల్లో బబ్బెర, పెసరు, శనగ వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితం యాసంగిలో 16,995 ఎకరాలకు కేవలం 9వేల ఎకరాలు మాత్రం రెండో పంట సాగయ్యేది. ప్రస్తుతం కాళేశ్వరం జలాలు వస్తుండడంతో పూర్తి స్థాయి విస్తీర్ణంలో సాగవుతున్నది.
ఎకరం మిరపకు 3.50లక్షలు
మాది గడ్డివానిపల్లి. గతేడాది ఎకరంలో తేజ అనే రకం మిరప సాగు చేసిన. 28 క్వింటాళ్ల దిగుబడి అచ్చింది. అప్పుడు మార్కెట్లో క్వింటాల్కు 18 వేల ధర ఉంది. మొత్తం 5.04 లక్షల దాకా అచ్చినయ్. పెట్టుబడి 1.50 లక్షల దాకా అయినయ్. ఈ యేడు అదే రకం వేసిన. ఇప్పుడిప్పుడే మిరప కాయలు చేతికత్తున్నయ్. ఈసారి కాలం మంచిగ లేదు. కొంచెం దిగుబడి పడిపోతదనిపిస్తుంది. ఎంత లేదన్నా 2.50 లక్షల వరకు మిగులుతయి. నేను ఐదేండ్ల నుంచి మిరపనే సాగు చేస్తున్న.