న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని గవర్నరే ట్విటర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతలపై ప్రధాని తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్లు గవర్నర్ జగ్దీప్ ఆ ట్వీట్లో తెలిపారు. ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత బెంగాల్లో హింస చెలరేగింది.
ఈ హింసలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసపై స్పందించిన మోదీ మంగళవారం గవర్నర్కు ఫోన్ చేసి పరిస్థితులపై ఆరా తీశారు. ఆ తర్వాత గవర్నర్ జగ్దీప్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, లూటీ, దహనాలు, హత్యలు నిరంతరాయంగా కొనసాగుతుండటంపై గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ హింసలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను కలవడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రెండు రోజుల పాటు బెంగాల్లో పర్యటించే అవకాశం ఉంది.
అయితే ప్రధాని ఈ స్టంట్లు ఆపి ముందు ఇండియాలో కొవిడ్ పరిస్థితులపై దృష్టి సారించాలని టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రైన్ ట్వీట్ చేశారు. అందులో ఢిల్లీలో ల్యాండైన 300 టన్నుల కొవిడ్ ఎమర్జెన్సీ సరఫరాలు ఏమయ్యాయి అన్న ఓ న్యూస్ రిపోర్ట్ను పోస్ట్ చేశారు. కొవిడ్ పరిస్థితులు లేదా దీనిపై ముందు దృష్టి సారించండి అని ప్రధానికి సూచించారు.