శాతవాహన వీసీ సంకశాల మల్లేశం
బాధ్యతల స్వీకరణ
కమాన్చౌరస్తా, మే 24 : శాతవాహన విశ్వవిద్యాలయానికి యూజీసీ నుంచి 12(బీ) గుర్తింపు తీసుకురావడానికే మొదటి ప్రాధాన్యం ఇస్తానని వైస్ చాన్స్లర్ సంకశాల మల్లేశం స్పష్టం చేశారు. విద్యా ప్రమాణాలు పెంపొందించి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన ఆయన, సొంత ఉమ్మడి జిల్లాలో సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం యూనివర్సిటీలోని తన చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కళాశాల రిజిస్ట్రార్ టీ భరత్, అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.
శాతవాహన యూనివర్సిటీలో అన్ని సమస్యలకు యూజీసీ నుంచి 12(బీ)తోనే పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నానని, తన మొదటి ప్రాధాన్య అంశంగా దానిని సాధించేందుకు కృసి చేస్తానని వైస్చాన్స్లర్ సంకశాల మల్లేశం స్పష్టం చేశారు. 12(బీ) సాధిస్తే యూనివర్సిటీకి జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టుల నుంచి నిధులు సమకూర్చుకునే అవకావాలు ఉంటాయని, దీని ద్వారా యూనిర్సిటీలో విద్యార్థులకు ప్రయాగాత్మక విద్యను అందించవచ్చని చె ప్పారు. ఈమేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సొంత జిల్లాకు సేవ చేసుకునే అవకాశం కొంతమందికే లభిస్తుందని, తనకు రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో డిగ్రీ, పీజీ స్థాయిలో అందిస్తున్న విద్యపై అవగాహన ఉన్నదని, ఆ అవగాహనతో శాతవాహన యూనివర్సిటీని ప్రత్యేకంగా తీసుకుని అభివృద్ధి వైపు ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనకు ప్రభుత్వంతో ఉన్న మంచి సంబంధాలతో స్థానిక మంత్రి, ప్రజాప్రతినిధుల సహకారంతో యూనివర్సిటీకి అధిక నిధు లు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
స్కిల్ ఓరియంటెడ్ కోర్సులు ప్రవేశపెడతాం
ప్రస్తుతం యూనివర్సిటీలోని అన్ని విభాగాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని, ప్రత్యేక ఉద్యోగాలకు అవసరపడేలా విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని, దీనికోసం అన్ని విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న కోర్సులనూ బలోపేతం చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం
యూరివర్సిటీ ప్రారంభమైన నాటి నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో జాప్యం జరిగిన మాట వాస్తవమేననీ, ఆ పోస్టులను భర్తీ చేస్తూ యూనిర్సిటీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటానని వీసీ స్పష్టం చేశారు. పలు రకాల పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని, ఎంపిక విధానంపై రాష్ట్ర ఉన్నత విద్యా పరిషత్ నుంచి నిర్ణయం వెలువడాల్సిన అవసరం ఉందన్నారు. అది పూర్తికాగానే పోస్టులను భర్తీ చేసి, పూర్తి స్థాయి సిబ్బందితో విద్యా ప్రమాణాలు పెంపొందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేస్తాం
యూనివర్సిటీ పరిధిలోని ఎస్ఆర్ఆర్, మహిళా డిగ్రీ కళాశాలతో పాటు అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేస్తామని, దోస్త్ సైన్ను ప్రవేశపెట్టడంద్వారా దూర ప్రాంతాల విద్యార్థులకు అన్ని కళాశాలల చదువులు దగ్గరయ్యాయని చెప్పారు. ప్రతి విద్యార్థికి తమకు నచ్చిన కళాశాలలో ప్రవేశం పొందేలా ఇది ఉపయోగపడుతుందన్నారు. ప్రభు త్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా అక్క డ అందించే సేవలు, అందుతున్న విద్యా ప్రమాణాల గురించి ప్రచారం చేస్తామని తెలిపారు. తన అభ్యర్థన మేరకు సొంత ఉమ్మడి జిల్లాలోని యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు వీసీ మల్లేశం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వీసీని ప్రభుత్వ విప్, చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.