హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): సోమవారం వ్యాక్సినేషన్ ఉంటుందా.. ఉండదా అనే అంశంపై వైద్యారోగ్యశాఖ స్పష్టత ఇవ్వలేదు. వ్యాక్సిన్ల కేటాయింపులో కేంద్రం రాష్ర్టానికి మొండి చేయి చూపుతున్నది. దీంతో రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు నిండుకున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా వ్యాక్సినేషన్ నిలిచిపోగా మూడోరోజు కూడా అదే పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆదివారం రాత్రి వరకు అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రాష్ర్టానికి కేంద్రం కేటాయిస్తానన్న 4.4 లక్షల డోసులు ఏమాత్రం చాలవని, పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు కేటాయించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం.
కొత్తగా 7430 కేసులు
రాష్ట్రంలో శనివారం 76 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 7,430 మందికి పాజిటివ్గా తేలింది. 5,567 మంది కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయినట్టు ఆదివారం వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 56 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వరకు 24,818 పడకలు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.