న్యూఢిల్లీ : కంపెనీ పాలసీల కంటే దేశ చట్టాలే అత్యున్నతమని, భారత చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందేనని సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టంచేసింది. నూతన ఐటీ నిబంధనల విషయంలో ట్విట్టర్కు, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు ట్విట్టర్ ఇండియా ప్రతినిధులు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ప్రతినిధులపై కమిటీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. భారత నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్విట్టర్పై ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని గట్టిగా ప్రశ్నించినట్టు సమాచారం. సమావేశంలో బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, రాజ్యవర్ధన్ రాథోడ్, తేజస్వి సూర్య, సంజయ్ సేత్, జఫర్ ఇస్లాం, సుభాష్ చంద్ర పాల్గొన్నారు. ప్రతిపక్షం నుంచి థరూర్తోపాటు తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. కంపెనీ విధానాలు ప్రధానమా, దేశ చట్టాలు ముఖ్యమా అని సమావేశం సందర్భంగా ట్విట్టర్ ప్రతినిధులను ఎంపీలు (ముఖ్యంగా బీజేపీ సభ్యులు) ప్రశ్నించినట్టు సమాచారం. తాము భారత చట్టాలను గౌరవిస్తామని, అయితే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కంపెనీ పాలసీలను అనుసరించాల్సి ఉంటుందని ట్విట్టర్ ప్రతినిధులు బదులిచ్చినట్టు తెలిసింది. దీనిపై ప్యానెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కంపెనీ పాలసీల కంటే దేశ చట్టాలే అత్యున్నతమని తేల్చిచెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నూతన ఐటీ నిబంధనలను తప్పక పాటించాల్సిందేనని సభ్యులు ఏకగ్రీవంగా తెలిపినట్టు పేర్కొన్నాయి. పూర్తిస్థాయి కంప్లయన్స్ ఆఫీసర్ను నియమించకుండా తాత్కాలిక అధికారిని నియమించడంపైనా సభ్యులు ప్రశ్నించినట్టు సమాచారం.
లిఖితపూర్వక సమాధానాలు
ట్విట్టర్ వేదిక దుర్వినియోగం, పౌరుల హక్కులకు సంబంధించి ట్విట్టర్కు గతవారం పార్లమెంటరీ ప్యానెల్ నోటీసులు జారీచేసింది. ట్విట్టర్ ప్రతినిధులతో మరోదఫా చర్చలు జరుపాలని ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించగా, ప్యానెల్ మాత్రం వివిధ ప్రశ్నలకు ట్విట్టర్ నుంచి లిఖితపూర్వక సమాధానాలు కోరిందని సమాచారం.
భావప్రకటనస్వేచ్ఛ కోసం పనిచేస్తాం
పారదర్శకత, భావప్రకటన స్వేచ్ఛ, గోప్యతపై కంపెనీ నిబంధనలను అనుసరించి ప్రజల హక్కుల రక్షణకు పార్లమెంటరీ కమిటీతో కలిసి పనిచేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నదని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రజల సమాచారాన్ని పరిరక్షించాలనే ఉమ్మడి బాధ్యతలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.