న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెల మనకు ఎంతో ముఖ్యమైన నెల అని, ఎందుకంటే ఈ నెలలో మనం వరల్డ్ రివర్ డే జరుపుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. నదులు నిస్వార్థంగా మనకు నీటిని సమకూరుస్తున్న అంశాన్ని గుర్తుచేసుకోవడం కోసం వరల్డ్ రివర్ డే జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు వరల్డ్ రివర్ డే జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ ప్రజలందరినీ తాను ఒక్కటే కోరుతున్నానని, ఏడాదికి ఒక్కసారన్నా దేశంలో నది పండుగ (River festival) చేసుకుందామని ప్రధాని పేర్కొన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఇప్పటివరకు తాను అందుకున్న బహుమతులను ప్రత్యేకంగా ఈ-వేలం వేసే ప్రక్రియ కొనసాగుతున్నదని, ఈ-వేలంలో వచ్చే మొత్తాన్ని తాను నమామీ గంగే క్యాంపెయిన్కు అంకితం చేస్తానని చెప్పారు. తమిళనాడులోని నాగా రివర్ ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయిందని, అయితే అక్కడి గ్రామీణ మహిళల చొరవ, ప్రజల భాగస్వామ్యంతో ఆ నదికి మళ్లీ జీవం వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ నదిలో పుష్కలంగా నీరు ఉందన్నారు.