బోడుప్పల్, మార్చి25: ‘అత్యున్నత లక్ష్యాలు చేరుకునేందుకు జీవితాన్నంతా దారపోయండి’.. అన్న స్వామి వివేకానందుడి మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఆ యువకుడు సేవా మార్గం వైపు పయనించాడు. ఉన్నంతలో సేవ చేస్తూ.. అభాగ్యులకు కొండంత భరోసా అవుతున్నాడు. అతడే శ్రీరాజ ఫౌండేషన్ నిర్వాహకుడు ఉదయ్రెడ్డి. ఏడేండ్ల కిందట ప్రారంభించిన తన స్వచ్ఛంద సంస్థ ద్వారా తినడానికి తిండి లేని వారి ఆకలి తీర్చి.. అనాథలకు ఆత్మబంధువయ్యాడు… మానసిక వైకల్యం ఉన్న వారికి, వృద్ధులకు బతుకుపై భరోసా కల్పించి.. పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. వైద్యశాలల్లో రోగులకు సపర్యలు చేసి.. మానవత్వాన్ని చాటుకుంటున్నాడు.
సోనూసూద్ నుంచి ప్రశంస..
ఇటీవల నగరానికి వచ్చిన సోనూసూద్ శ్రీ రాజమాత ఫౌండేషన్ చేస్తున్న సేవలను తెలుసుకొని తాను కలిసిన ఉదయ్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. తాను సూద్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నట్లు ఉదయ్ చెప్పారు. ఫౌండేషన్ వివరాలకు www.rajamathafoundation.orgలో సంప్రదించవచ్చని సూచించారు.
ఏటెరుగు వెంకట నారాయణరెడ్డి, మంగమ్మ దంపతుల సంతానం ఉదయ్రెడ్డి, మనోజ్రెడ్డి కవల పిల్లలు. నాచారం హెచ్ఎంటీకాలనీలో నివాసం. చిన్నతనం నుంచే ఉదయ్రెడ్డిలో సేవ చేయాలన్న సంకల్పం బలంగా ఉండేది. అలా 2014లో బోడుప్పల్ చెంగిచర్ల క్రాంతికాలనీలో ముగ్గురు స్నేహితుల సహకారంతో శ్రీ రాజమాత ఫౌండేషన్ను ఏర్పాటు చేశాడు. ఉదయ్లోని నిస్వార్థ సేవను గమనించిన మరికొందరు సంస్థలో భాగస్వాములయ్యారు . అలా ఇప్పుడు ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక్షంగా, పరోక్షంగా మూడు వేల మంది వలంటీర్లు పరుల సేవలో తరిస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో అనేక మంది ఇంటికే పరిమితమయ్యారు. తినడానికి తిండి లేక అనేక జీవితాలు దుర్భరంగా మారాయి. అలాంటి వారికి శ్రీరాజమాత ఫౌండేషన్ అండగా నిలిచింది. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అన్నంపెట్టి ఆకలితీర్చింది. బతుకుపై భరోసా కల్పించి.. ధైర్యాన్ని నూరి పోసింది. కరోనా కష్టకాలం, ఇటీవల కురిసిన వర్షాలకు నిరాశ్రయులైన వారికి చేయూతనిచ్చింది. ఇప్పటివరకు 30 వేల మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసి.. సంకల్ప స్ఫూర్తిని రగిలించిందీ స్వచ్ఛంద సంస్థ. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ ద్వారా వారంలో నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనాథలు, యాచకులు, రోడ్డు పక్కన ఉండే వారికి పట్టెడన్నం పెట్టి.. కడుపునింపుతున్నారు.