న్యూఢిల్లీ : వాహనదారులకు చమురు కంపెనీలు మళ్లీ షాక్ ఇచ్చాయి. రెండు రోజుల తర్వాత సోమవారం మరోసారి ధరలను పెంచాయి. పెట్రోల్పై లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 33 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.53కు చేరుకుంది. డీజిల్ లీటర్కు రూ.82.06కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.86, డీజిల్ రూ.89.17, చెన్నైలో పెట్రోల్ రూ.93.38, డీజిల్ రూ.86.93, కోల్కతాలో పెట్రోల్ రూ.91.66, డీజిల్ రూ.84.90, హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.95.13కు, డీజిల్ ధర రూ.89.47కు చేరాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1.25 శాతం పెరుగుదలతో 69.07 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 1.11 శాతం పెరుగుదలతో 65.62 డాలర్లకు పెరిగింది.
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ క్రమంలో పెరుగుతూ, తగ్గుతుంటాయి.. లేదంటే స్థిరంగా కొనసాగుతూ వస్తుంటాయి. ఇటీవల వరుసగా నాలుగు రోజులుగా ధరలు పెరగ్గా.. రెండు రోజుల పాటు పెంచకపోవడంతో వాహనదారులు ఊరట కలిగింది. ఇప్పటికే దేశంలో పలు చోట్ల ధరలు రూ.100 దాటాయి. ఈ క్రమంలో మళ్లీ ధరలు పెరుగడంతో వాహనాలు బయటకు తీసేందుకే బెంబేలెత్తి పోతున్నారు. ఓ వైపు కొవిడ్ మహమ్మారి వేళ ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంపై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.