పాట్నా: దేశంలో నిన్నటి వరకు అగ్నిపథ్కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. తాజాగా మహారాష్ట్రలోని అధికార శివసేనలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో బీహార్కు చెందిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ తనదైన స్టైల్లో ఈ రెండింటిని పోల్చారు. సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్ను తెచ్చి వివాదాన్ని రాజేసిన ప్రధాని నరేంద్ర మోదీ చాలా తెలివిగా దీనిపై వ్యతిరేకత, నిరసనల దృష్టిని మహారాష్ట్రలోని శివసేన వైపునకు మళ్లించారని విమర్శించారు. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్ గురువారం ఒక ట్వీట్ చేశారు. ‘వావ్..! చాయ్ వాలా (మోదీ) ఎంత కళాత్ముడు! ఆర్మీ (సేన) దృష్టిని ‘శివసేన’ వైపు మళ్లించారు. అద్భుతమైన మాస్టర్స్ట్రోక్..!’ అని హిందీలో పేర్కొన్నారు.
కాగా, అగ్నిపథ్కు వ్యతిరేకంగా పదికిపైగా రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకు దిగిన యువత పలు రాష్ట్రాల్లో అల్లర్లకు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్లపై దాడులు చేసి పలు రైళ్లకు నిప్పుపెట్టారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు కూడా అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా గళమెత్తాయి.
మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో ఏడాదిపాటు నిరసనలు చేసి కేంద్రం వాటిని వెనక్కు తీసుకునేలా చేసిన రైతు సంఘాల కూటమి, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కూడా అగ్నిపథ్ను వ్యతిరేకించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
वाह..! क्या कलाकारी है चाय वाले की, सेना का ध्यान शिवसेना पर डाल दी।
ग़ज़ब का मास्टरस्टोक..!
— Tej Pratap Yadav (@TejYadav14) June 23, 2022