న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ కొవిడ్ సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ మాట్లాడుతూ.. కొవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని విస్తరిస్తున్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యు ఘంటికలు మోగిస్తుందని అన్నారు.
వ్యాక్సిన్స్ వ్యూహాన్ని కేంద్రం సరిగా అమలు చేయకుంటే భారత్ అనేక కొవిడ్ వేవ్లను చవిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్పై పోరాటంలో లాక్డౌన్ ఉపకరిస్తుంది. అయితే లాక్డౌన్, సామాజిక దూరం పాటించడం, మాస్క్లు ధరించడం అనేవి కోవిడ్పై పోరాటంలో తాత్కాలిక వ్యూహాలు మాత్రమే. దేశం నుంచి కరోనాను తరిమికొట్టాలంటే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గం’ అన్నారు.
కొవిడ్ వైరస్ మ్యుటేట్కు అవకాశం ఇవ్వకుండా సక్రమంగా వ్యాక్సినేషన్ స్ట్రాటజీ అమలు చేయాలని, అలా కాని పక్షంలో మూడు, నాలుగు, ఇలా చాలా వేవ్లను దేశం ఎదుర్కోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో అనేక మరణాలు చోటుచేసుకోవడానికి కేంద్రం, ప్రధాని మోదీ నేరుగా బాధ్యులని ఆయన ఆరోపించారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్కు ప్రధాని ‘నాటకమే’ కారణమని, ఆయన కొవిడ్ను సరిగా ఆర్థం చేసుకోలేదని అన్నారు.