లక్నో : ఈ ఏడాది మార్చిలో రామమందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో అవినీతి జరిగిందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు ఆరోపించాయి. మందిర నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటైన శ్రీ రామజన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్ పై అయోధ్యలో భూమి కొనుగోలు వ్యవహారంలో ఎస్పీ, ఆప్ లు ఆరోపించడం కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోసిపుచ్చారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మందిర నిర్మాణం చేపట్టిన ట్రస్ట్ పై ఆరోపణలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్ధలాన్ని అధిక ధరలకు రామ మందిర్ ట్రస్ట్ కొనుగోలు చేసిందని ఎస్పీ, ఆప్ లు ఆరోపిస్తున్నాయి. రూ 2 కోట్ల విలువైన ఈ స్ధలాన్ని ఏకంగా రూ 18.5 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించిన ఆయా పార్టీలు ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.