న్యూఢిల్లీ: రాజ్యసభలో పియూష్ గోయల్ లీడర్ ఆఫ్ ద హౌజ్గా వ్యవహరించానున్నారు. తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఆ బాధ్యతలను సీనియర్ మంత్రి పియూష్ గోయల్కు బీజేపీ అప్పగించింది. ఈ రేసులో ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్లాంటి వాళ్లు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ పార్టీ మాత్రం గోయల్ వైపే మొగ్గు చూపింది. ఇక అటు లోక్సభలో అధిర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్కు కాంగ్రెస్ పక్ష నేత బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే రెండు రోజుల్లో సమావేశమై దీనిపై ఆ పార్టీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 19న వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
తేవర్చంద్ గెహ్లాట్ను కర్ణాటక గవర్నర్గా నియమించిన తర్వాత ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో నాయకుడు లేడు. ఆ కీలకమైన బాధ్యతలను 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పియూష్ గోయల్కు బీజేపీ అప్పగించింది. రెండేళ్లుగా గోయల్ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు బిల్లులకు రాజ్యసభలో మద్దతు కూడగట్టడంలో పియూష్ కీలక పాత్ర పోషించారు.
రాహుల్కే బాధ్యతలు
ఇటు లోక్సభలో అధిర్ రంజన్ చౌదరి స్థానంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పక్ష నేతగా నియమించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటు మనీష్ తివారీ, శశి థరూర్, గౌరవ్ గొగొయ్, రవ్నీత్ సింగ్ బిట్టుల పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తోంది. రాహుల్ ఈ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నా.. ఆయనే ముందు వరుసలో ఉన్నట్లు ఓ సీనియర్ నేత వెల్లడించారు. రఫేల్ డీల్పై వచ్చే వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్.. ఓ బలమైన నేతను తమ పక్ష నేతగా నియమించాలని చూస్తోంది.