తిరువనంతపురం, మే 20: కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్)ని వరుసగా రెండోదఫా అధికారంలోకి తీసుకువచ్చిన పినరాయి విజయన్ రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విజయన్తో పాటు 20 మంది మంత్రులతో గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సాగిన ఈ కార్యక్రమానికి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. క్యాబినెట్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కేకే శైలజకు చోటు కల్పించకపోవటంపై ఏచూరి స్పందిస్తూ.. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలతోపాటు కొత్తవారికి చోటివ్వాలన్న ఉద్దేశంతోనే పాతవాళ్లను ఎవరినీ తీసుకోలేదని చెప్పారు.