నిజామాబాద్, మార్చి 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏడాది కాలంగా చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తున్నది. ఇటీవల వరకు కేసుల సంఖ్య తగ్గినట్లే కనిపించినా సెకండ్ వేవ్ రూపంలో మహమ్మారి విరుచుకుపడుతున్నది. రాష్ట్రంలోనూ రోజురోజుకూ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య వందల్లోకి చేరింది. ఉమ్మడి జిల్లాలోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మందిని పొట్టన పెట్టుకుని మొత్తం వ్యవస్థనే నాశనం చేసిన కరోనా నుంచి సురక్షితంగా బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు గాను కొవిడ్-19 నిబంధనలను అమలు చేసేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా మాస్కు వాడకాన్ని తప్పనిసరి చేస్తూ జీవో విడుదల చేసింది. మాస్కు వాడకాన్ని ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు సైతం తీసుకోవాలంటూ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో యంత్రాంగం కూడా మాస్కు వాడని ప్రబుద్ధులపై కొరడా ఝుళింపించేందుకు సిద్ధం అవుతున్నది. ముఖ్యంగా ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారకులుగా మిగులుతున్న వారిని గుర్తించి జరిమానాల రూ పంలో దారిలోకి తెచ్చేందుకు కలెక్టర్లు సిద్ధం అవుతున్నారు.
ప్రభుత్వ జీవో ఇలా…
మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను పురపాలక, గ్రామ పంచాయతీలు కఠినంగా అమలు చేయబోతున్నాయి. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విస్తృతిని మొదట్లోనే నిరోధించేందుకు మాస్కులు వాడకం ముఖ్యమైన చర్యగా సర్కారు గుర్తించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు జీవో జారీ చేయడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. మాస్కులు లేకుండా బయటికి రావడం ఇక మీదట కుదరదు.
తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో మాస్కు కీలక భూమిక పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఇవి ఉపయోగపడతాయి. డబుల్ లేయర్తో గృహాల్లోనూ మాస్కులు తయారు చేసి పెట్టుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంటుంది. ఏడాది కిందట మాస్కుల వాడకంలో ధరల ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మాస్కులు ఇబ్బడి ముబ్బడిగా లభ్యమవుతున్నాయి.మెడలో అలంకార ప్రాయంగా కాకుండా ముక్కును, నోటినిపూర్తిగా చుట్టేసేలా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. ప్రజలతో పాటుగా ప్రభుత్వ అధికారులు వారి సిబ్బంది సైతం పని ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. గ్రామీణ ప్రాంతాలకు ఇదే వర్తించనుంది. యూజ్ అండ్ త్రో మాస్కులను ఉపయోగించిన అనంతరం సేఫ్టీ డస్ట్బిన్లోనే వేయాల్సి ఉంటుంది. బట్టతో కుట్టినవి ఉతుక్కుని ఎన్ని సాైర్లెనా వాడుకోవచ్చు.
వైద్యులు హెచ్చరిస్తున్నా…
ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నదని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రజలు మాత్రం మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ పరిధిలో జాగ్రత్తలు పాటిస్తున్న వారే కనిపించడం లేదు. ఆర్మూర్, బోధన్, భీమ్గల్ వంటి మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు. కరోనా పని అయిపోయింది… ఇంకెక్కడి కరోనా అంటూ వెటకారంగా మాట్లాడేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు. తనదాకా వైరస్ వస్తే కానీ దాని ప్రభావం అర్థం కావడం లేదు. నిర్లక్ష్యపూరిత వైఖరితోనే వైరస్ త్వరగా మనుషులను చుట్టేస్తోంది. కూరగాయలు, పండ్ల మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, మాల్స్లలో ప్రజలు ఎక్కువగా గుమిగూడుతున్నారు. టీ, టిఫిన్ సెంటర్లు, జ్యూస్ సెంటర్ల వద్ద ఎక్కువగా జనం కనిపిస్తున్నప్పటికీ జాగ్రత్త చర్యలు లేకపోవడం విడ్డూరంగా మారింది. నేటి వరకు నిజామాబాద్ జిల్లాలో 16,900 కేసులు నమోదు అయ్యాయి. నెల రోజుల క్రితం వరకు రోజుకు పది కేసులు వెలుగు చూస్తే ప్రస్తుతం 50 వరకు కేసులు వస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్ పాజిటివ్ సోకిన వారి సంఖ్య 14వేలు దాటింది.
అజాగ్రత్త పనికి రాదు
మార్చి నెల ప్రారంభం నుంచి క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గతేడాది పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. అజాగ్రత్త పనికి రాదు. వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది మధ్య వయస్సు వారే ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టెస్టుల సంఖ్యను పెంచాం. పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్నాం. అవసరమైన మందులు ఇస్తున్నాం. కేసులు పెరుగుతున్నాయని ఆందోళన చెందకుండా కొవిడ్-19 నిబంధనలు పాటిస్తే సరిపోతుంది. మాస్కులు వాడడం మాత్రం దిన చర్యలో భాగం కావాలి. మాస్కుతో పాటు భౌతిక దూరం పాటించడం, సబ్బుతో చేతులు నిత్యం శుభ్రం చేసుకోవడం కూడా ముఖ్యమే.
ఇవీ కూడా చదవండి..
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతా పాజిటివ్..ఎందుకిలా!
వర్క్ బిజీలో శృంగారానికి దూరమవుతున్నారా.. ప్రమాదమేనట!