న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ అంశంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని ఇవాళ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. లాయర్ ఎంఎల్ శర్మ ఆ పిల్ వేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు సీబీఐని ఆ పిల్లో పార్టీలుగా చేర్చారు. పెగాసస్ సాఫ్ట్వేర్తో భారతీయ పౌరులపై రాజకీయ ప్రయోజనాల కోసం నిఘా పెట్టినట్లు ఆ పిల్లో ఆరోపించారు. సుప్రీం వేసిన సిట్ ఆధ్వర్యంలో దీనిపై దర్యాప్తు జరగాలని పిల్లో కోరారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలపై నిఘా పెట్టే అధికారం ప్రధానికి, ఆయన మంత్రులకు ఉంటుందా అని పిల్లో శర్మ అడిగారు. సాఫ్ట్వేర్ను లీగల్గా ఖరీదు చేశారా అని ప్రశ్నించారు. సాధారణ పౌరులపై స్నూపింగ్.. హక్కుల ఉల్లంఘన అవుతుందా అని ప్రశ్నించారు.
పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిన మంత్రులను, పౌరులపై స్నూపింగ్ చేసినవారిని చట్టం ప్రకారం శిక్షించాలన్నారు. ప్రతిపక్ష నేతలు, రాజకీయవేత్తలు, కార్యకర్తలు, అడ్వకేట్లు, ఇతరులపై 2017 నుంచి స్నూపింగ్ జరుగుతోందని, ఆ చర్యలకు పాల్పడినవారిని శిక్షించాలన్నారు. నిఘా కోసం సాఫ్ట్వేర్ను కొనడం అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలని పిల్లో సుప్రీంకోర్టును కోరారు.