న్యూఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ( ITBP ) తొలిసారి మహిళా ఆఫీసర్లను తమ బలగాల్లోకి తీసుకున్న సందర్భమే మరో అరుదైన క్షణానికి వేదికైంది. మొత్తం 53 మంది అధికారులు ముస్సోరిలోని ITBP ట్రైనింగ్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. వీళ్లలో 42 మంది అసిస్టెంట్ కమాండెంట్స్ (జీడీ), 11 మంది అసిస్టెంట్ కమాండంట్స్ (ఇంజినీర్స్) ఉన్నారు. అయితే ఇందులో ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఉన్నారు. ప్రకృతి, దీక్ష అనే ఈ ఇద్దరూ పారామిలిటరీలో ఎంట్రీ లెవల్ ఆఫీసర్ ర్యాంక్ అయిన అసిస్టెంట్ కమాండంట్గా నియమితులయ్యారు.
వీళ్లలో దీక్ష తండ్రి కమలేష్ కుమార్ ఇప్పటికే ITBPలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ సెర్మనీ సందర్భంగా ఈ తండ్రీ కూతుళ్లు కలిశారు. దీంతో ఆ తండ్రి తన కూతురిని చూసి ఎంతో గర్వంగా సెల్యూట్ చేసి మురిసిపోయారు. దీక్ష కూడా నవ్వుతూ ఆయనకు సెల్యూట్ చేసింది. ఈ తండ్రీ కూతుళ్లు ఒకరికొకరు సెల్యూట్ చేసుకున్న ఫొటో వైరల్గా మారింది. ITBP అధికారిక ట్విటర్ ఈ ఫొటోను షేర్ చేసింది. తనకు తన తండ్రే రోల్ మోడల్ అని, ఆయనే తనను ఎంతగానో మోటివేట్ చేశారని ఈ సందర్భంగా దీక్ష చెప్పింది.