న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయకు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య ట్విట్టర్ వేదికగా ఇవాళ వార్ జరిగింది. జూలై నెల పూర్తయినా దేశంలో ఇంకా వ్యాక్సిన్ కొరత కొనసాగుతూనే ఉన్నదని ఈ ఉదయం రాహుల్గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు గతంలో వ్యాక్సిన్ కొరతకు సంబంధించిన ట్వీట్లు, హెడ్డింగ్లతో కూడిన వీడియోను కూడా జోడించాడు. జూలై 2న వేర్ ఆర్ వ్యాక్సిన్స్ అని చేసిన పోస్టుకు రిప్లేగా ఆ పోస్టు చేశారు.
అయితే, రాహుల్గాంధీ ట్వీట్కు ఆరోగ్యమంత్రి మన్సుక్ మాండవీయ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చారు. ఒక్క జూలై మాసంలోనే దేశవ్యాప్తంగా 13 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. జూలైలో వ్యాక్సిన్ వేయించుకున్న 13 కోట్ల మందిలో మీరు కూడా ఉన్నారని విన్నా. కానీ మీరు ఎప్పుడూ మన శాస్త్రవేత్తల గురించి మాట్లాడరు. ప్రజలకు వ్యాక్సిన్ వేసుకొమ్మని చెప్పరు. కానీ వ్యాక్సిన్ పేరుతో నీచ రాజకీయాలు చేస్తారు. నిజానికి దేశంలో వ్యాక్సిన్ కొరత లేదు.. మీలో పరిపక్వత లోపించింది అని ఆరోగ్యమంత్రి ట్వీట్ చేశారు.