హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రం, నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) మధ్య సోమవారం పరస్పరం ఒప్పందం కుదిరింది. దీంతో తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ వెంటనే అమల్లోకి వస్తుందని ఎన్హెచ్ఏ సీఈవో ఆర్ఎస్ శర్మ ప్రకటించారు. రాష్ట్ర పథకం ఆరోగ్యశ్రీతో కలిపి దీన్ని అమలుచేస్తామని ఆయన ప్రకటించారు. ఈ పథకాన్ని ‘ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ఆరోగ్యశ్రీ’గా పిలువనున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ అమల్లోకి రావడంతో ఆ జాబితాలోని దవాఖానల్లో అర్హులైన వారి కుటుంబాలకు రూ.5 లక్షల వరకు బీమా వర్తించనుంది. రాష్ట్ర ప్రజలు దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం దక్కిందని ఎన్హెచ్ఏ సీఈవో ఆర్ఎస్ శర్మ చెప్పారు. ప్రజలు అర్హత, పథకం వివరాలు తెలుసుకోవాలంటే 14555 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్చేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ వల్ల ఇప్పటివరకు 1.3 కోట్ల మంది లబ్ధిపొందారని తెలిపారు.