చెన్నై : తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. పెట్రోల్ ( Petrol ) పై విధించే రాష్ట్ర పన్నును తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి పీ తియగ రాజన్ తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసిన తర్వాత లీటరు పెట్రోల్ ధరపై మూడు రూపాయలు తగ్గనున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది సుమారు 1160 కోట్ల నష్టం వస్తుందని ఆయన అన్నారు. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. అన్ని నగరాల్లోనూ లీటర ధర వంద దాటింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.102.49గా ఉంది. ఇక ఆ నగరంలో డీజిల్ ధర రూ.94.39గా ఉంది. అయితే ఆ రాష్ట్రం పెట్రోల్పై రూ.32.90 ఎక్సైజ్ సుంకాన్ని వసూల్ చేస్తోంది. ఇప్పుడు దాన్ని తగ్గించడం వల్ల ఆ రాష్ట్రానికి భారం కానున్నది. ఆగస్టు 14వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి.