వారం వ్యవధిలో ఐదోసారి పెరుగుదల
రికార్డుస్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు
మహారాష్ట్రలో 100 దాటిన పెట్రోల్
న్యూఢిల్లీ, మే 10: పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజుల వ్యవధిలో ఐదోసారి పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లీటరుకు పెట్రోల్ 26 పైసలు, డీజిల్ 33 పైసలు చొప్పున సోమవారం పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ రూ.100 మార్కు దాటిన రాష్ర్టాల జాబితాలో మహారాష్ట్ర కూడా చేరింది. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగటం ఈ నెల 4 నుంచి ఇది 5వ సారి. అన్ని విడుతల్లో కలిపి లీటరుకు పెట్రోల్ రూ.1.14, డీజిల్ రూ.1.33 చొప్పున పెరిగాయి. దీంతో మార్చి 24 నుంచి ఏప్రిల్ 15 వరకు లభించిన తగ్గింపులన్నీ చల్లైపోయాయి. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.91.53కు, లీటరు డీజిల్ ధర రూ.82.06కు చేరింది. మహారాష్ట్రలోని ప్రభానిలో లీటరు పెట్రోల్ రూ.100.20కు పెరిగింది. కొద్ది రోజుల కిందటే పెట్రోల్ ధర రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో రూ.102.42, మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో రూ.102.12కు చేరింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్కు దాటడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.