పెట్రో ధరల మోత మోగనున్నది. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వినియోగదారులపై భారం పడే అవకాశాలున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు సమీపించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సెగలు గ్లోబల్ క్రూడ్ మార్కెట్ను తాకుతుండటంతో మరింత పెరగవచ్చంటున్నారు.
నిజానికి ఎన్నికలు లేకపోతే దేశీయ మార్కెట్లో ధరల పెంపు ఎప్పుడో మొదలయ్యేదే. ఎడాపెడా పెంచుకుంటూపోతున్న చమురు మార్కెటింగ్ సంస్థలు..
ఎన్నికల కోసమే బ్రేక్ ఇచ్చాయన్న వాదన గట్టిగా వినిపిస్తున్నది. దీంతో మోదీ సర్కారు ఊ అనగానే బాదుడు మొదలేనంటున్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. గతకొద్ది రోజులుగా ఆగిన బాదుడు ధోరణి.. తిరిగి మొదలుకానున్నది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరల మోత మోగడం ఖాయమన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. నిజానికి ఈ ఎన్నికలు లేకపోతే ఇంధన ధరల పెంపు ఇప్పటికే మొదలయ్యేదన్న వాదనలు బలంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.110కి సమీపంలో ఉండగా, డీజిల్ రేటు రూ.95 పలుకుతున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్లో పెట్రోల్ను రూ.108.20, డీజిల్ను రూ.94.62కు విక్రయిస్తున్నారు. 2017 జూన్ నుంచి రోజువారీ ధరల సవరణను చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రారంభించాయి. దేశీయ ఇంధన ధరలను అంతర్జాతీయ చమురు ధరలతో అనుసంధానించి మార్చుతూ వస్తున్నాయి. అయితే దేశంలో ఎక్కడైనా ఎన్నికలుంటే మాత్రం గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు ఎంత పెరిగినా స్థిరంగానే ఉంటుండటం విశేషం. ఇంధన ధరల పెంపు నిర్ణయాధికారం చమురు సంస్థలకే ఉందంటున్న కేంద్రం నీతిని ఇది ప్రశ్నించేలా ఉన్నది. ఇప్పుడు కూడా 110 రోజుల నుంచి ధరల పెంపే లేదు. కారణం అసెంబ్లీ ఎన్నికలే.
గతంలోనూ..
2018 మే నెలలో కర్నాటక ఎన్నికల ముందు 19 రోజులు ఇంధన ధరలు పెరగలేదు. నాడు అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ధర 5 డాలర్లు పెరిగింది. ఎన్నికల తర్వాత వరుసగా 16 రోజులు ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం పెంచుతూపోయాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.3.8, డీజిల్ ధర రూ.3.38 పెరిగింది. 2017 డిసెంబర్లోనూ గుజరాత్ ఎన్నికల వేళ 14 రోజులు ధరల పెంపునకు విరామం ఇచ్చారు. అంతకుముందు 2017 జనవరి 16 నుంచి 2017 ఏప్రిల్ 1 మధ్య పంజాబ్, గోవా, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల సమయంలోనూ ధరల జోలికి వెళ్లిన దాఖలాల్లేవు. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ధరల పెంపు దిశగా చమురు మార్కెటింగ్ కంపెనీలు వెళ్లకపోవడం గమనార్హం.
ద్రవ్యోల్బణం భగ్గుమంటే..
కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం ముప్పు ముంచుకొస్తున్నది. పెట్రో ధరలు పెరిగితే అన్ని రంగాలు ప్రభావితం కాకతప్పదని, తద్వారా అన్ని వర్గాలకూ ఇబ్బందులేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రయోజనాలే తప్ప.. సామాన్యుల గోడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు పట్టడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆమోదయోగ్య స్థాయిని దాటేసింది. పెరిగే పెట్రో ధరలతో ప్రజలపై పెను భారమే పడుతుంది.
పన్నుల భారం..
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే.. ఆ లాభాన్ని వినియోగదారులకు ఇవ్వకుండా ఎక్సైజ్ సుంకం పెంచి తమ ఖజానాకు తరలించిన చరిత్ర మోదీ సర్కారుది. 2020లో లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. ఇదే ఏడాది మే 6న మరోసారి పెట్రోల్పై రూ.10, డీజిల్పై 13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీలను వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరల్లో రూ.30కిపైగా కేంద్ర పన్నుల భారమే ఉండటం గమనార్హం.