న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు 35 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.90, డీజిల్ రేటు రూ.105.05కు చేరింది. గతేడాది మే 5వ తేదీ నుంచి చూస్తే ఇప్పటి వరకు(18 నెలల్లో) పెట్రోల్ రేటు రూ.36, డీజిల్ రేటు రూ.26.58 చొప్పున పెరిగాయి. గతేడాది మేలో అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర 19 డాలర్లకు పడిపోయింది. అందుకు అనుగుణంగా ఇండియాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ అలా జరగకుండా మే 5వ తేదీన కేంద్రం వాటిపై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచింది. ఫలితంగా ధరలు తగ్గలేదు. రికార్డు స్థాయిలో పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.13 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. దీంతో పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.32.9, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.31.8కి పెరిగింది.