చంఢీఘడ్ : భారత మేటి స్ప్రింటర్ మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్ రంగంలో భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మిల్కాకు వివిధ రంగాల ప్రముఖులు ఘన నివాళులు అర్పిస్తున్నారు. మిల్కా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. పంజాబ్లో ఒక రోజు సెలవు దినంగా ప్రకటించనున్నారు. గొప్ప క్రీడాకారుడిని కోల్పోయామని, ఇది మనకు ఎంతో నష్టాన్ని మిగిల్చిందని, నేటి తరం యువత ఆయన్ను స్పూర్తిగా తీసుకుంటుందని కెప్టెన్ అమరీందర్ తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో మిల్కా సింగ్ చైర్ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. సౌతాంప్టన్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఆడుతున్న భారత జట్టు ఆటగాళ్లు మిల్కా మృతికి నివాళిగా నల్లబ్యాండ్లు ధరించారు.