హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగాచేస్తున్న పోరాటంలో తెలంగాణకు అనుకూలంగా మరో నిర్ణయం వెలువడింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణశాఖ వాయిదావేసింది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని సూచించింది. ప్రాజెక్టు డ్రాయింగ్స్, లేఔట్లు, చార్టుల వివరాలు, ప్రాజెక్టు ద్వారా ఎంత నీటిని వాడుకోవాలని అనుకుంటున్నారు? భూ సేకరణ ప్రక్రియ, ఆయకట్టు వివరాలను వివరంగా పంపాలని స్పష్టంచేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల కమిటీ ఈ నెల 16,17 తేదీల్లో సమావేశమైంది. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏపీ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించింది. ఈ మేరకు ఏపీ సమర్పించిన వివరాలు సరిగా లేవని కమిటీ నిర్ధారించింది. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ అవసరంలేదని ఏపీ పేర్కొనగా, డ్రాయింగ్స్లో ఈ స్పష్టతలేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. లేఔట్లో అప్రోచ్ కెనాల్, లింక్ కెనాల్లను గుర్తించలేదని పేర్కొన్నది. ఈ అసంపూర్ణ సమాచారం వల్ల ప్రాజెక్టుతో పరావరణానికి జరిగే హానిని నిర్ధారించలేమని కమిటీ తేల్చింది. ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలని ఏపీకి సూచించింది. అప్పటివరకు అనుమతులను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
ఈ అంశాల్లో స్పష్టతలేనందున ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను వాయిదావేస్తున్నట్టు నిపుణుల కమిటీ పేర్కొన్నది.