ప్రభుత్వ దవాఖానలకు వైద్య పరికరాల వితరణ
30 జిల్లాలకు పంపిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ సైబరాబాద్ పోలీసులతోపాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరో భారీ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని 30 జిల్లాల్లో ప్రభుత్వ దవాఖానలకు అవసరమైన వైద్య పరికరాలను అందించిం ది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంనుంచి శుక్రవారం 30 డీసీఎంల ద్వారా ఈ సామగ్రిని జిల్లాలకు పంపారు. వీటిలో బెడ్స్, పల్స్ ఆక్సిమీటర్స్, స్లైన్ స్టాండ్స్, శానిటైజర్ స్టాండ్స్, బాడీ కవర్స్, మాస్కులు, స్ట్రెచర్స్, వీల్ చైర్స్ తదితర వస్తువులున్నాయి. ఐటీ కారిడార్ పరిధిలోని ప్రావిడెన్స్, హార్స్కో, ఫినిక్స్, మెట్రోకెమ్, సిగ్నిట్, కెస్టే సాఫ్ట్వేర్, ఆర్సెసీయూమ్, ఇన్నొమైండ్స్, నాల్సాఫ్ట్, కోపార్ట్, సన్డ్యూ, రాజపుష్పా ప్రాపర్టీస్ తదితర కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యతకింద ఈ సాయాన్ని అందించాయి. వివిధ జిల్లాల ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్కు తరలివస్తుండటం తో స్థానిక దవాఖానలపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ చర్య చేపట్టాయి. ఈ కంపెనీలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. కార్పొరేట్సం స్థల సహకారంతో తెచ్చిన covid.scsc.in, టెలిమెడిసిన్ కేంద్రం సర్వీసులను వారంలో లక్ష మంది నగర ప్రజలు వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ మాణిక్ రాజు, ఎస్టేట్ అధికారి ఏసీపీ సంతోష్కుమార్, ఏసీపీలు హనుమంతరావు, చంద్రశేఖర్రెడ్డి, రాములు, రవీందర్ పాల్గొన్నారు.