గువహటి : కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ కూటమి అసోంలో చొరబాట్లను ప్రోత్సహిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రంలో నిత్యం సమ్మెలు, వివాదాలు, ఆందోళనలు సాగాయని ఆ పార్టీ ఇప్పటికీ అదే తీరుతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఏఐయూడీఎఫ్, సీపీఎంలతో కాంగ్రెస్ దోస్తీ అసోంలో చొరబాట్లకు ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు కీలక అంశంగా మారాయి. మరోవైపు అసోం ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా విడుదల చేస్తూ అసోం ప్రజల రాజకీయ హక్కులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. సమయానుకూలంగా అసోంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేస్తామని చెప్పారు.