న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జనం ఇంకొన్నాళ్లు కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్టు సౌమ్యాస్వామినాథన్ ( Soumya Swaminathan ) చెప్పారు. ఇది రక్షణలు వదిపెట్టాల్సిన సమయం కాదని, నిబంధనలు ఇంకా కొనసాగించాల్సిందేనని ఆమె సూచించారు. మరో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని సౌమ్యాస్వామినాథన్ చెప్పారు.
మరో ఆరు నెలల కల్లా వ్యాక్సినేషన్ పూర్తయిన వారి సంఖ్య బాగా పెరుగుతుందని, ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే పరిస్థితులు మెరుగుపడటం మొదలవుతుందని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. కాగా, సౌమ్యాస్వామినాథన్ చెప్పినట్లే ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గలేదు. భారత్, అమెరికా, చైనా తదితర దేశాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే సౌమ్యాస్వామినాథన్ తాజా సూచన చేశారు.