లక్నో: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ వారిని కాపాడుకునేందుకు కరోనా రోగుల బంధువులు అందుబాటులో ఉన్న మార్గాల్లో ఆక్సిజన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ వద్ద జనం క్యూకట్టారు. ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.
తాను ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నానని, మధ్యాహ్నమైనా ఆక్సిజన్ ట్యాంకర్ ఇంకా రాలేదని ఒకరు తెలిపారు. మరోవైపు గత రెండు రోజులుగా ఈ ప్లాంట్లో ఆక్సిజన్ను సరఫరా చేయడం లేదని స్థానికుడైన ఒకరు వెల్లడించారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నారు.