న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. కేంద్రం ఇటీవల చేసిన ప్రకటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ‘ఓబీసీ రిజర్వేషన్పై జాబితాను సిద్ధం చేయమని రెండు రోజుల క్రితం కేంద్రం రాష్ట్రాలను కోరింది. దీంతో ఓబీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. కానీ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. సుప్రీం కోర్టు ఇప్పటికే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పింది. మరోవైపు దాదాపు అన్ని రాష్ట్రాలు రిజర్వేషన్ల పరంగా 50 శాతం మార్కును దాటాయి’ అని శరద్ పవార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ రిజర్వేషన్ కోసం జాబితాలను సిద్ధం చేసి వాటిపై తమ స్థాయిలో నిర్ణయం తీసుకోవచ్చునని కేంద్రం చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకుకెళ్లడం ముఖ్యమని చెప్పారు.