బరాజ్లు, రిజర్వాయర్లకు పర్యాటక శోభ
లక్ష్మీ, పార్వతీ, ఎల్లంపల్లి, మధ్యమానేరులో బోటు షికారుకు టూరిజం శాఖ ఏర్పాట్లు
ఇప్పటికే సిరిసిల్లలో సిద్ధంగా పడవలు
త్వరలోనే అన్ని చోట్లా అందుబాటులోకి..
పెద్దపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు. సీఎం కేసీఆర్ అద్భుత సృష్టికి నిదర్శనం. దిగువకు పారే గోదావరిని ఎదురెక్కించే మహాద్భుత ఎత్తిపోతల పథకం.. అనేక బరాజ్లు.. రిజర్వాయర్లు, పంప్హౌస్ల సమాహారం ఇది. ప్రాజెక్టులోని ఏ బరాజ్ చూసినా నిండుకుండలా కనిపిస్తుంది. చుట్టూ గుట్టలు.. మధ్యలో నీటి గలగలతో ప్రకృతి ప్రేమికుల మనసుదోచేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ నుంచి జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల దాకా 112 కిలో మీటర్ల గోదావరి తీరం, అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం ప్రకృతి రమణీయతో ముచ్చటగొలుపుతుంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భం సమయంలోనైతే ఆయా ప్రాంతాల్లో జాతరనే కనిపించింది. పంప్హౌస్లు, నిండుకుండలా ఉన్న బరాజ్లు, రిజర్వాయర్లు, బహుబలి మోటర్ల ఎత్తిపోతలు చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు.
9కోట్లతో లాంచీలు, బోట్లు..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచం దృష్టినే ఆకర్షించిన నేపథ్యంలో గోదావరి, ప్రాజెక్టులో జల అందాలను తిలకించేందుకు ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటగా రిజర్వాయర్లు, బరాజ్లలో డబుల్ డెక్కర్ ఏసీ లాంచీలు, స్పీడ్ బోట్లు, కేవలం విదేశాల్లో మాత్రమే ఉండే అల్యూమినియం పాంటూన్ బోట్ల ఏర్పాటుకు 9కోట్లు మంజూరు చేయగా, పనులు జరుగుతున్నాయి. అన్నిచోట్లా వచ్చే జూన్ చివరిక ల్లా జలవిహారానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే మధ్యమానేరు అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో తొ లుత అక్కడే లాంచీ ప్రయాణం జరుగనుంది. కాగా పార్వతీ బరాజ్ బ్యాక్ వాటర్లో గోదావరిఖని వద్ద అడ్వెంచర్స్ అండ్ అక్వా టూరి జం ఆధ్వర్యంలో బోటింగ్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు బోటింగ్ చేస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
పర్యాటక ప్రాంతంతో ఉపాధి
కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంత వాసులకు మంచి ఉపాధి దొరకనున్నది. ఉదాహరణకు ఒక్కో లాంచీ ద్వారా 12 మంది వరకు ఉద్యోగ, ఉపాధి పొందే అవకాశాలున్నాయి. అదే విధంగా స్పీడ్ బోట్లతో సైతం మరో ఇద్దరికి ఉద్యోగాలు లభిస్తాయి. దీనికి తోడు బోటింగ్ జరిగే ప్రాంతాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే వీలున్నది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం జలాలపై విహార యాత్రలు చేసే అవకాశం ఉండడంతో పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి.