అమీర్పేట్, మార్చి 21: ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించే రాజకీయ శక్తుల ఆటలు సాగవని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునే క్రమంలో బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు మంత్రి తలసాని చేసిన సూచనలు మంచి ఫలితాలనిచ్చాయని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి అన్నారు. ఆదివారం ఆమె ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో మంత్రిని ఆయన నివాసంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మ్రంతి తలసాని మాట్లాడుతూ ప్రజలను ముఖ్యంగా యువతను పక్కదారి పట్టించే విధంగా సామాజిక మాధ్యమాల్లో సత్యదూరమైన పోస్టింగులు పెడుతున్న పార్టీల పన్నాగాలను తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూపిన చొరవ అమోఘమన్నారు. ప్రైవేటీకరణ, పెరుగుతున్న నిత్యావసర ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన బీజేపీ ప్రయత్నాలను అంతా కలిసి కట్టుగా తిప్పికొట్టడం వల్లే బీజేపీని ప్రజలు నిలువరించారన్నారు. భవిష్యత్తులో కూడా సామాజిక మాధ్యమాల్లో బీజేపీ పన్నాగాలను తిప్పికొట్టే విషయంలో టీఆర్ఎస్ శ్రేణులు అంతే ధీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నిమ్మ నరేందర్రెడ్డి, అశోక్యాదవ్, కరుణాకర్రెడ్డి. గోపీలాల్ చౌహాన్, ప్రవీణ్రెడ్డి, హరిసింగ్జాదవ్, కూతురు నర్సింహ, గుడితె సత్యనారాయణయాదవ్, గుడిగె శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వాణీదేవి విజయం ఆనందకరం..
బన్సీలాల్పేట్: శాసన మండలి సభ్యురాలిగా సురభి వాణీదేవి విజయం సాధించడం ఎంతో ఆనందకరమని, ఆమె గెలుపు కోసం సమష్టిగా కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందిస్తున్నానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కుర్మ హేమలత మంత్రిని కలిసి శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు.