భోపాల్: అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని అన్నారు. మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఉషా ఠాకూర్ ఈ మేరకు శనివారం బహిరంగ ప్రకటన చేశారు. ఖండ్వాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. “మిత్రులారా, సెల్ఫీలు తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని మీకు తెలుసు. దీని వల్ల కొన్నిసార్లు మాకు చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి పార్టీ పరంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఎవరైతే సెల్ఫీలు క్లిక్ చేస్తారో వారు స్థానిక పార్టీ యూనిట్ కోశాధికారికి రూ.100 జమ చేయాలి. ఇలా సమకూరిన డబ్బును పార్టీ పనుల కోసం వినియోగించుకోవచ్చు’ అని తెలిపారు.
అలాగే బహిరంగ కార్యక్రమాలకు తనను పిలిచే వారు పుష్పగుత్తులకు బదులు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి ఉషా సూచించారు. అలా అందిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. మరోవైపు ఈ బీజేపీ మంత్రి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా రెండు డోసుల టీకాలు వేయించుకున్న ప్రజలు పీఎం కేర్స్ నిధి కోసం రూ.500 విరాళంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.